ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు.
యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రత కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం గారు పలు మార్పులు సూచించారు.
సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గారు, ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు గారు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ గారు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు తదితరులు పాల్గొన్నారు.